ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకొనేందుకు “జగనన్నకు చెబుదాం” ఒక మంచి వేదిక అవుతుందని రాష్ట్ర సీఎం జగన్ అన్నారు. ప్రజలు తమ సమస్యలను 1902 నెంబరుకు తెలియజేసి పరిష్కరించుకోవాలని కోరారు. ఈ నెంబరుకు ఫోన్చేసి తెలియజేస్తే ఆ సమస్య నేరుగా సి.ఎం. కార్యాలయానికి చేరుతుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక మెరుగైన వేదికను ఏర్పరిచే లక్ష్యంతోనే “జగనన్నకు చెబుదాం” తీసుకువచ్చామన్నారు. తాడేపల్లి నివాసం నుంచి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు, జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయిలో వుండే సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి వ్యవస్థలన్నీ బలోపేతం కావడం ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందుతాయని తద్వారా సమస్యలు తగ్గే అవకాశం వుంటుందన్నారు. జిల్లాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు ఆయా వ్యవస్థల బలోపేతంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం అందించడం, తద్వారా అర్జీదారుల సంతోషమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పి.సురేష్ బాబు, జిల్లా ప్రత్యేక అధికారి, పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్.పి. దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డి.సి.ఎం.ఎస్.మాజీ ఛైర్మన్ కె.వి.సూర్యనారాయణ రాజు, ఏ.పి.టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రేగాన శ్రీనివాసరావు, డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్పందనలో ఇచ్చే వినతులు ఏ కారణం వల్లయినా పరిష్కారం కానట్లయితే అటువంటి వినతులను సి.ఎం. కార్యాలయ స్థాయిలో వాటికి పరిష్కారం చూపేందుకే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గతంలో స్పందనలో వినతులు ఇచ్చినప్పటికీ పరిష్కారం కానివారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని 1902 కు ఫోన్చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు. జిల్లా నుంచి ఎంత తక్కువగా ఫోన్ కాల్స్ ఈ నెంబరుకు వెళ్లే ఆ జిల్లాలో యంత్రాంగం అంత సమర్ధంగా పనిచేస్తున్నట్టు సూచికగా భావించాల్సి వుంటుందని పేర్కొన్నారు.మణిపూర్లో చిక్కుకున్న 157 మంది తెలుగు విద్యార్ధులను వారి స్వస్థలాలకు సురక్షితంగా చేర్చామని మంత్రి బొత్స వెల్లడించారు. అమరావతి రాజధాని అయినంత మాత్రాన అక్కడ సామాన్యులు, మధ్యతరగతి వారు నివాసం వుండకూడదని చెప్పడం సబబుకాదన్నారు. రాజధానిలో సాధారణ పౌరులు నివాసం వుండకూడదా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడాన్ని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు మంత్రులు, సీనియర్ అధికారులను పంపించి నష్టాలకు గురైన ఆదుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల ఎలాంటి నష్టాలు జరగలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.