ఆర్కేపురం డివిజన్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తుల, నాయకులు ప్రజా తీర్పును గౌరవిస్తూ మరింత బాధ్యతగా పని చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు ఎన్నికలలో విజయం కోసం కష్టపడ్డారని వారందరికీ (గెలుపోటములతో సంబంధం లేకుండా) అభినందనలు తెలిపారు.
గ్రేటర్లో అతి పెద్ద పార్టీ టీఆర్ఎస్
ప్రథమంగా విజయ భారతి రెడ్డి డివిజన్ ప్రజలపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. గ్రేటర్ లో అతి పెద్ద పార్టీగా టిఆర్ఎస్ ను ఆదరించిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలన్నారు. ప్రజలు ఎళ్ళవేళలా టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటారని కితాబిచ్చారు. అభివృద్ధితో కాకుండా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి గెలిచే ప్రయత్నం ప్రతిపక్షాలు చేశాయని విమర్శించారు. తెలంగాణ అభివృద్దే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.
ఆర్కేపురంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ దయనంద్, డివిజన్ పార్టీ అధ్యక్షులు అరవింద్, అభ్యర్థిని విజయభారతి అరవింద్, మార్కెట్ చైర్మన్ రాంనరసిoహ్మ గౌడ్, పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బేర బాలకిషన్, మాజీ ఎంపీపీ జిల్లెల కృష్ణ రెడ్డి, బండి మీనా, పటేల్ సునీత రెడ్డి, చంద్రయ్య, జయేందర్, నాగేష్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యానికి పెద్దపీట వేసిన సీఎం
టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వైద్యానికి పెద్దపీట వేశారని, నిరుపేదల పాలిట బస్తీదవాఖానాలు ప్రారంభించడం, ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న ఆసుపత్రుల్లో నిరుపేదలకు మెరుగైన కార్పొరేట్ తరహా వైద్యాన్నందించడం అభినందనీయమని, అలాగే ఓటమి – గెలుపు రాజకీయంలో ఎప్పుడూ ఉండేవేనని, ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని, మరింత బాధ్యతగా పనిచేసి ప్రజలకు చేరువవ్వాలని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారంనాడు మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ కూడలిలో మెడ్విక్ ఆస్పత్రిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు.
కార్పొరేట్కు ధీటుగా నిరుపేదలకు వైద్యం
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రులు సేవ భావంతో పని చేయాలని, వైద్యులను ప్రజలు దేవుళ్ళుగా భావిస్తారని, వైద్యులు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. పట్టణాల్లోనే కాకుండా ముఖ్యంగా నూతనంగా వైద్య వృత్తి చేపట్టే వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకూ సేవలందించేందుకు ముందుండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు వైద్యరంగంలో ప్రతీ ఒక్కరికి ఉన్నతమైన, కార్పొరేట్కు ధీటుగా వైద్యం అందించాలనే ఆశయంతో పనిచేస్తున్నారని, ఆయన ఆశయం గొప్పదని అందుకనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. కరోనా కట్టడం సమయంలో కూడా ఎంతో నేర్పుగా – ఓర్పుగా రాష్ర్ట ప్రభుత్వం పనిచేసిందన్నారు. కరోనా విషయంలో ప్రస్తుతం కూడా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి శంకర్ పల్లి లో ఫజల్ హోటల్ను ప్రారంభించి, ఎస్ బి సూపర్ మార్కెట్ ను సందర్శించారు.