రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరిస్తామని చెబుతున్న మంత్రులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్.సంజయ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించారు.
నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషనర్కి ఐజీ సంజయ్ సహకరించనున్నారు. ఐజీ సంజయ్కి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు.
విజయవాడలోని ఆర్అండ్బి బిల్డింగ్ లోని మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలను ఇవ్వడం అనేది గతంలో కూడా వుంది. వాటిని మరింత పెంచుతూ, ఏకగ్రీవాలను పెంచాలన్న మంచి ఉద్దేశంతో మా ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి విధానాలను అమలు చేస్తున్నాయి. ఏకగ్రీవాలు కావాలని దేశంలోని పలు రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయి. అటువంటి ఏకగ్రీవాలపై ఐజి స్థాయి అధికారితో పర్యవేక్షణ చేయిస్తామనడంను ఎలా అర్థం చేసుకోవాలి.
రాజ్యాంగ స్పూర్తితో, బాపూజీ కన్న కలలను సఫలీకృతం చేయడానికి ఈ ఆలోచనతో ప్రభుత్వం నడుస్తోంది. రాజ్యాంగబద్దంగా ఎన్నికల కమిషన్ కు పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తామని చెప్పిన తరువాత కూడా ఇలా చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ ఎన్నికల కమిషనర్ ను మంత్రులు తప్పుపట్టారు.