విశాఖపట్నంలో 12 మంది మరణానికి కారణం అయిన విషవాయువు లీక్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్ జి పాలిమర్స్ కంపెనీ డైరెక్టర్లు తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. తక్షణమే పాస్ పోర్టులను స్వాధీన పరచాలని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.
విషవాయువు లీకేజీ ఘటనను మే 7న హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు ఎవరి అనుమతి తీసుకున్నదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది.
యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, డైరెక్టర్లను స్వేచ్ఛగా వదిలేయడం, స్టైరిన్ గ్యాస్ తరలించేందుకు అనుమతించడంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం నాటి విచారణ తర్వాత హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు విడుదల చేసింది. ఎల్జీ పాలిమర్స్ పరిసరాలను సీజ్ చేయాలని.. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ లోనికి అనుమతించకూడదని తెలిపింది.
గ్యాస్ దుర్ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రమే ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది. ఏం పరిశీలించారో రికార్డు పేర్కొనాలని తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్ను తరలించేందుకు.. ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది.