బ్రహ్మోత్సవాలకు, కళోత్సవాలకు, విజయోత్సవాలకు వేదికగా కరీంనగర్ మారిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈరోజు కరీంనగర్లో జరిగిన దసరా సక్సెస్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానేరు నీళ్లలోనే ఒక పవర్ ఉందని, తెలంగాణ సంస్క్రుతిలోనే ఒక గొప్పదనం ఉందన్నారు. మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు బలగంతో, పెద్దపెల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల దసరాతో కరీంనగర్ సత్తా చాటారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించడం వల్లే మట్టిలోని మాణిక్యాలు బైటకొస్తున్నాయని అన్నారు.
కాసర్ల శ్యామ్ గొప్ప పాటలు రాస్తు తెలంగాణ సంస్క్రుతిని బైటకు తీసుకొస్తున్నారని, నాని ఎక్కడ పుట్టినా దసరా సినిమా తర్వాత మా తెలంగాణ బిడ్డయ్యాడని, గతంలో తెలంగాణ భాష గుండాలకు పెట్టారు. నేడు తెలంగాణ భాష లేకపోతే సినిమాలే లేని పరిస్థితికి వచ్చిందని గర్వంగా ఉందన్నారు. తెలంగాణ భాషతో సినిమా తీస్తే సూపర్ హిట్ అనేది సినిమా ఇండస్ట్రీలో స్థిరపడడం శుభపరిణామం అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి దాదాసాహెబ్ పాల్కె అవార్డు అందుకున్న పైడి జయరాజ్, జ్ణానపీఠ్ పొందిన సినారే ఇలా నాటి తరంనుండి నేటి తరం వరకూ సినిమాకు ఆయువుపట్టుగా కరీంనగర్ నిలుస్తూనే ఉందన్నారు.
దసరా యూనిట్ సభ్యులందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ కరీంనగర్ ఎనర్జీ అద్బుతంగా ఉందని, ఈవెంట్ సక్సెస్ కు సహకరించిన మంత్రి గంగుల కమలాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. కరీంనగర్లో అద్బుతమైన అభివృద్ధితో పాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుందని త్వరలోనే ఇక్కడ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తానన్నారు.