అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో సుమారు రూ. 1300 కోట్లతో వివిధ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గుజరాత్ ఆరోగ్య సదుపాయాలను పెద్ద మలుపుతిప్పిన రోజు ఇది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అత్యంత అధునాతన వైద్య సాంకేతికతతో, మెరుగైన సౌకర్యాలు మరియు వైద్య మౌలిక సదుపాయాలు ఇప్పుడు అహ్మదాబాద్ లో మరింత అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.
సైబర్ నైఫ్ వంటి ఆధునిక సాంకేతికత ఆరోగ్య శస్త్ర చికిత్స అందుబాటులోకి వచ్చిన దేశంలోనే ఇది మొదటి ఆసుపత్రి. గుజరాత్ తరహాలో అభివృద్ధిలో వేగం పుంజుకున్నప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని ప్రధాని తెలిపారు. ఎప్పటిలాగే గుజరాత్ దేశంలోనే తొలిసారిగా చేస్తున్న పనులు చాలా ఉన్నాయని ప్రధాని వెల్లడించారు. 20-25 ఏళ్ల క్రితం గుజరాత్ లో అనేక వ్యాధులు ప్రబలి ఉండేవని ఆరోగ్య రంగంలో వెనుకబాటుతనం ఉండేదని ఆయన అన్నారు. వైద్య విద్యలో అక్రమాలు, కరెంటు లేకపోవడం, నీటి కొరత, శాంతి భద్రతలు సరిగా లేకపోవడం లాంటి వ్యాధులు ఉండేవని ప్రధాని తెలిపారు.
ఈ వ్యాధులకు మూలమైన అతిపెద్ద వ్యాధి ఓటు బ్యాంకు రాజకీయాలకు తాము చరమగీతం పాడామని ప్రధాని మోడీ తెలిపారు. ఆ రోగాలన్నింటినీ వదిలేసి నేడు గుజరాత్ అగ్రగామిగా ఉంది. గుజరాత్లో ఇప్పుడు నీరు, విద్యుత్, శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని ప్రధాని అన్నారు. నేడు సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్ ప్రభుత్వం గుజరాత్ సేవ కోసం నిరంతరం కృషి చేస్తోంది.
ఈ రోజు హైటెక్ ఆసుపత్రుల విషయానికి వస్తే, గుజరాత్ పేరు అగ్రస్థానంలో ఉందని ప్రధాని అన్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత గుజరాత్ నేర్పిన విషయాలు తనకు బాగా ఉపయోగపడాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆరోగ్య దృక్పథంతో, తాము కేంద్రంలో కూడా పనిచేయడం ప్రారంభించామని, ఈ 8 ఏళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 22 కొత్త ఎయిమ్స్లను ఏర్పాటు చేశాం. దీని వల్ల గుజరాత్ కూడా లాభపడింది అని ఆయన తెలిపారు.