నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చతుర్వేద సహిత సరస్వతి యాగం, చండీయాగం, వేద వ్యాస మహర్షి ఆలయంలో వేద ఉపనిషత్తుల పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య దంపతులు గురుపౌర్ణమి వేడుకలలో పాల్గొన్నారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి దంపతులు వేద వ్యాస మహర్షి కి పట్టు వస్త్రాలు సమర్పించారు.
గతంలో బాసరను వ్యాసపురి గా తిరిగి నామకరణం చేయడానికి ప్రయత్నించి సఫలీకృతం కాలేక పోయామని చుక్కా రామయ్య అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని బాసర ను వ్యాసపురి గా పేరు మార్చేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు.