తెలంగాణ శాసన మండలిలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందుగా డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పులా మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగరేశారు.
జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తరువాత అభివృద్ధికి నోచుకుందని ఆయన అన్నారు. 14 సంవత్సరాలు ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో నడిపిన నాయకుడిని ముఖ్యమంత్రి గా ఎన్నుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టం గా మారిందని సుఖేందర్ రెడ్డి అన్నారు.
వంద ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని ఆరు వసంతలలో సాధించుకున్నామని, బీడు భూముల్లో కూడా రెండు పంటలు పండించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను పూర్తి చేశారని ఆయన అన్నారు. త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు లు పూర్తి కాబోతున్నాయని ఆయన వెల్లడించారు.
దేశంలోనే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్టం గా ఉందని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్ కృషి తో ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎనలేని అభివృద్ధి సాధించిందని ఆయన వెల్లడించారు.