లాక్ డౌన్ కారణంగా నాయీ బ్రాహ్మణ హెయిర్ కటింగ్ సెలూన్ లు పూర్తిగా బంద్ కావడంతో రెక్కాడితే గాని డొక్కాడని క్షౌర వృత్తిదారుల కుటుంబాలు వీధిన పడ్డాయని అందువల్ల ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో 32 హెయిర్ కటింగ్ షాప్ లు ఉన్నాయి.
చిట్యాల పట్టణంలో సుమారుగా 70 కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అదేవిధంగా మండల కేంద్రంలో నాయీ బ్రాహ్మణ వృత్తిదారుల కుటుంబాలు కూడా పూర్తిగా బతుకులు చితికి పోయి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రతి నాయీ బ్రాహ్మణ కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ప్రతి నెల లాక్ డౌన్ విధించినన్నీ రోజులు ఇవ్వాలని అదేవిధంగా ప్రతి సెలూన్ షాప్ కు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు, డిస్పోజబుల్ టవల్స్, డ్రెస్సులు ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు వారు తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ లకు నేడు వినతి పత్రం సమర్పించారు. షాప్ కిరాయిలు, కరెంటు బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ అధ్యక్షులు అమరోజు వెంకటేశం, గౌరవ అధ్యక్షులు అమరోజు బుచ్చయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చికిలంమెట్ల అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శి అమరోజు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.