మువ్వన్నెల జెండా ప్రతి ఇంటి పైన ఎగురవేయాలని విజయనగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పిలుపునిచ్చారు. హర్ ఘార్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నగరంలోని 29వ డివిజన్ పరిధిలో టౌన్ సెంటర్ లేఅవుట్ లో సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి , ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగుర వేయాలని, స్వాతంత్ర్య దినోత్సవం అనంతరం వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాలు చేశారని అన్నారు. తమ అసమాన పోరాటంతో ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయులు ఎంతోమంది ఉన్నారని అన్నారు.
ఆనాటి త్యాగధనుల పోరాట ఫలితమే నేడు మనం స్వేచ్ఛ జీవులుగా ఉంటున్నామని అన్నారు. అటువంటివారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఇంటికి జెండా అందిస్తున్నప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు గుణశేఖర్, పైడితల్లి అమ్మవారి ఆలయ పాలకమండలి సభ్యులు అచ్చిరెడ్డి, లింగమూర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.