వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి.
రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాలలోనూ భారీవర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శ్రీలంకకు తూర్పున 600 కి.మీ. దూరంలో, తమిళనాడులోకి కారైకల్కు 630 కి.మీ. దూరంలో, చెన్నై తీరానికి 670 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. నెమ్మదిగా వాయుగుండం కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.