ప్రపంచవ్యాప్తంగా నేడు మిలియన్ల మంది ప్రజలు ఏదో ఒక విధంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత అర్ధ శతాబ్దంలో మనోరోగచికిత్సలో పురోగతి ఉన్నప్పటికీ, మానసిక రుగ్మతల స్థాయి ప్రమాదకర స్థాయిలో పెరుగుతూనే ఉంది. అనేక కారణాల వల్ల భారతదేశంలో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడం లేదు. మానసిక రుగ్మతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య భారానికి ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొనవచ్చు.
COVID-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజల మానసిక ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 ప్రభావం వలన విచారం, భయం, ఒత్తిడి మరియు ఒంటరితనం ఏర్పడి ఆందోళన మరియు డిప్రెషన్ ఇంకా అనేక మానసిక రుగ్మతలకు దారితీసింది. ఇది ప్రపంచాన్ని మెరుగైన , ఆరోగ్యకరమైన సమాజంగా మార్చడానికి మన ప్రయత్నాలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని అందిస్తుంది.
నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ, NMHP యొక్క దృష్టి మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, మానసిక అనారోగ్యాన్ని నివారించడం, మానసిక అనారోగ్యం నుండి కోలుకోవడం మరియు అందరికీ అందుబాటులో, సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్యం మరియు సామాజిక సంరక్షణ అందించడం ద్వారా మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం ప్రధాన అంశం కావాలి.
పిల్లల మానసిక ఆరోగ్యం – భవిష్యత్తు కోసం ఒక విజన్
దేశం ప్రస్తుత ఆరోగ్య దృష్టాంతంలో, పాఠశాలకు వెళ్లే పిల్లల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రధానమైనది. పాఠశాల వాతావరణంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. భారతదేశంలో పాఠశాలస్థాయి మానసిక ఆరోగ్య సంరక్షణ బాల్య దశలోనే ఉంది. జాతీయ మానసిక ఆరోగ్య విధానం అనేది ప్రాథమిక దశలో పరిష్కరించబడే పిల్లల మానసిక అనారోగ్యాలు మరియు అభివృద్ధిపరమైన రుగ్మతలను గుర్తించడానికి పాఠశాల స్థాయి కార్యాచరణ ప్రణాళికలో తప్పనిసరి చెయ్యాలి. విద్యార్థి దశలోనే పిల్లల మానసిక ఆరోగ్య సంరక్షణ చేపట్టి , భవిష్యత్ లో పౌరులుగా ఎదిగే సమయానికి ఏటువంటి మానసిక రుగ్మతలకు గురికాకుండా జాగ్రత్త పడినట్లయితే చ్చాల వరకు మనో వ్యాధులకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది.
మానసిక ఆరోగ్య సంరక్షణ – హోమియోపతి పాత్ర
హోమియోపతి వైద్యం ద్వారా వివిధ రకాల మానసిక సమస్యలకు పరిష్కారం ఉంది. ఇది బై-పోలార్ డిజార్డర్స్, స్కిజోఫ్రెనియా, డిప్రెషన్ మరియు జనరల్ యాంగ్జయిటీ డిజార్డర్లతో సహా పలు రకాల మానసిక అనారోగ్యాలను నివారణ చేయగలదు. హోమియోపతి వైద్యం యొక్క లక్ష్యం మానసిక సమస్యలకు చికిత్స చేయడమే కాదు, దాని మూల కారణం మరియు వ్యక్తిగత గ్రహణశీలతను పరిష్కరించడం కూడ.
హోమియోపతిక్ సిస్టం ఆఫ్ మెడిసిన్ స్థాపకుడు డాక్టర్ శామ్యూల్ హనీమాన్ , బహుశా వ్యాధి ప్రక్రియను అర్థం చేసుకోవడంలో మనస్సు యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపిన మొదటి వ్యక్తి. హోమియోపతి వైద్య సిద్ధాంతం ప్రకారం శరీరం-మనస్సు-ఆత్మ ఒకటిగా చూపబడుతుంది. హోమియోపతిలో, మనస్సు అన్ని రుగ్మతలకు మూలకర్తగా పరిగణించబడుతుంది.
వ్యాధి చికిత్సలో హోమియోపతి వైద్య విధానం సమగ్ర మైనది. భావోద్వేగాలు లేదా మానసిక లక్షణాల ద్వారా మనస్సు డైనమిక్స్ మరియు దాని వ్యక్తీకరణలు ముఖ్యమైన అంశాలలో ఒకటిగా పరిగణించబడతాయి. మానసిక వ్యాధుల చికిత్సలో ఈ అంశం కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుత కాలంలోని తీవ్రమైన మానసిక ఆరోగ్య అవసరాలను తీర్చడంలో హోమియోపతి వైద్య ఉపయోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి మరియు ప్రపంచ మానసిక అనారోగ్య భారాన్ని తగ్గించడంలో దాని పాత్రను అన్వేషించాలి.
డా.జి.దుర్గాప్రసాద్ రావు, హైదరాబాద్