సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇల్లు కట్టించి ఇవ్వాలని, బిల్డింగ్ కు మూడున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ కడప నగర కార్యదర్శి యన్. వెంకట శివ పేర్కొన్నారు. కడప జిల్లా ఎన్టీఆర్ నగర్ లో, మామిళ్ల పల్లి లేఅవుట్ లో ఇళ్ల లబ్దిదారులతో కలసి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో బతుకు భారంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం సముచితంగా ఉంటుందన్నారు. ఇళ్ల స్థలం పట్టా ఇచ్చేటప్పుడు ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తుందని నమ్మబలికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు పొంది అనంతరం సకాలంలో ఇల్లు మీరే కట్టుకోవాలని హుకుం జారీ చేస్తుండడం దారుణమన్నారు.
పేదలకు నగరానికి సుదూరంగా ఉన్న సెంటు స్థలంలో లివింగ్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్, బాత్రూం, వరండా లతో సౌకర్యవంతంగా ఇళ్ళు నిర్మించుకోవాలని సిఎం ప్రగల్బాలు పలకడం దారుణమన్నారు. ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్ష రూపాయలు కేటాయిస్తూ ఉంటే సీఎం జగన్ మాత్రం 30 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇస్తుండడం సిగ్గుచేటన్నారు.
కడపలోని జగనన్న లేఅవుట్లలో అసౌకర్యాల నడుమ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్షన్ల తో సంబంధం లేకుండా లబ్ధిదారులే ఇల్లు కట్టుకోవాలని సీఎం బుకాయిస్తుoడటం దారుణమన్నారు.
సీఎం జగన్ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని వారు కోరారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం విడనాడాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు పగడపూల మల్లికార్జున, వడ్ల భాగ్యలక్ష్మి, వేదాంతం, నారాయణ, బుజ్జి, రాముడు, రంగస్వామి, ఇళ్ల లబ్ధిదారులు లక్ష్మీనారాయణమ్మ, నిర్మల, లక్ష్మి, దావీదు, లక్షుమ్మ ,ప్రసన్న, సుభాన్, విజయలక్ష్మి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.