తూర్పు గోదావరి జిల్లా రామచద్రాపురం నియోజకవర్గం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు లభ్యమైంది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచి అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఈ భారీ నగదు పట్టుబడింది. అక్రమ మద్యం తరలింపు సమాచారం అందుకున్న అమలాపురం స్పెషల్ బ్రాంచి అధికారులు గంగవరం మండలం కూళ్ళ వద్ద తనిఖీలు నిర్వహించారు.
ఈ నెల 24 మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించగా ద్రాక్షారామకు చెందిన ప్రవీణ్ కుమార్ జైన్ అనే వ్యక్తి యాక్టివా బండి పై భారీ నగదు తీసుకెళ్తున్నట్లు గుర్తించి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోటీ 23 లక్షల రూపాయలు నగదు పట్టు బడినట్టు గంగవరం ఎస్సై చిరంజీవి మీడియాకు తెలిపారు. ప్రవీణ్ కుమార్ జైన్ అనే వ్యక్తి బండి డిక్కీలో ఈ సొమ్ముతో అమలాపురం వెళ్తున్నట్టు చెప్పారని తెలిపారు.
ఈ నగదు తరలింపుకు సంబంధించి ఎటువంటి పత్రాలు గానీ రశీదులు గానీ లేవని తెలిపారు. నగదును రాజమండ్రి ట్రెజరీకి అప్పగించినట్లు ఆయన చెప్పారు. అమలాపురం బులియన్ కార్పోరేషన్ సభ్యుడిగా వ్యవహరిస్తున్న కుమార్ తరచూ రామచంద్రపురం, ద్రాక్షారామ ప్రాంతాలకు బంగారం చేరవేసి నగదు లావాదేవీలు జరుపుతున్నట్లు సమాచారం.