శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలు సాఫీగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసు ఛీఫ్ సి.వి.ఆనంద్ అధ్యక్షతన ద్రౌపది గార్డెన్ లో అంతర్ శాఖా సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు, ఆర్అండ్బీ, విద్యుత్, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సిపి ఆనంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహారించి ఉత్సవాలు సజావుగా సాగేలా సహకారం అందించాలని కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి మంగళ్హోట్, రామ్కోటి మధ్య ప్రధాన ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన అనంతరం శ్రీరామనవమి శోభాయాత్ర ఏర్పాట్లను ఆయన మీడియాకు వివరించారు.
“శోభ యాత్ర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, నగర పోలీసు యంత్రాంగం విస్తృతమైన భద్రతా ప్రణాళికను రూపొందించింది. శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా పోలీసులు మరియు వాలంటీర్ లకు సహకరిస్తూ, పండగను సంతోషంగా జరుపుకోవాలి” అని సిపి సి.వి.ఆనంద్ తెలిపారు.
సీతారాంబాగ్ ఆలయం, భోయిగూడ కమాన్, పురానాపూల్ గాంధీ విగ్రహం, బేగంబజార్ ఛత్రి, ఎస్ఏ బజార్ మాస్క్, గౌలిగూడ కమాన్, కోటి ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ బస్టాండ్, హనుమాన్ వ్యాయామశాల స్కూల్ రామ్ కోటి ప్రాంతాల మీదుగా ఊరేగింపు సాగుతుందని, నిర్వాహకులు పోలీసులు సూచించిన మార్గంలో మాత్రమే ఊరేగింపు నిర్వహించాలని కమీషనర్ వెల్లడించారు.
ఊరేగింపు మార్గంలో రోడ్డు మరమ్మతులు, అదనపు లైటింగ్, అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించుట, దారికి అడ్డుగా ఉన్న ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించుట వంటి పనులు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. శోభ యాత్ర సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు
అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ డి.ఎస్ చౌహాన్, జి హెచ్ ఏం సి కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జాయింట్ సిపి స్పెషల్ బ్రాంచ్ పి.విశ్వ ప్రసాద్, జాయింట్ సిపి ట్రాఫిక్ ఏ.వి.రంగనాథ్, డిసిపి వెస్ట్ జోన్ జోయెల్ డేవిస్, డిసిపి ట్రాఫిక్ కరుణాకర్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, మనోహర్ ఆర్ &బి డిపార్ట్మెంట్, నరసింహా చారి చీఫ్ ఇంజనీర్, భాగ్యనగర్ ఉస్తావ్ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు, గోవింద్ రత్కే, ఆనంద్ సింగ్ నిర్వాహకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.