రామతీర్థం లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామస్వామి ఆలయంలో, సీతారామలక్ష్మణుల బాలాలయ విగ్రహ ప్రతిష్ట గురువారం శాస్త్రబద్ధంగా జరిగింది. నీలాచలం కొండపై ఆలయం కోసం టిటిడి రూపొందించిన ఈ నూతన విగ్రహాలను ఆలయంలో ఉంచి, చర ప్రతిష్ట నిర్వహించారు.
దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంబ పర్యవేక్షణలో, శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ ప్రవిత్ర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. టిటిడి నుంచి విగ్రహాలను తెప్పించిన తరువాత, ఈనెల 25న ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వివిధ కార్యక్రమాల అనంతరం ముహూర్తం ప్రకారం ఉదయం 8.56 నిమిషాలకు పూర్ణాహుతితో ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నీలాచలం కొండపై ఆలయ నిర్మాణం పూర్తి అయ్యే వరకూ, ఈ సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఇక్కడే ఉంచి, ఎప్పటిలాగే నిత్య ఆరాధన, కైంకర్యాలను నిర్వహిస్తారు.
ఏడాదిలోపు కొండపై ఆలయాన్ని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్టించాలని దేవాదాయశాఖాధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ సుజాత, టిటిడి ఆగమ సలహాదారు సుందర వరదన్,
ఆలయ ఇఓ సిహెచ్ రంగారావు, ఇన్స్పెక్టర్ లక్ష్మి, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఇఓ జీవీఎస్ఎస్ఆర్ సుబ్రమణ్యం, ఆలయ పూజారులు, ఇతర దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ట పూర్తి
నీలాచలం కొండపై ఆలయం కోసం రూపొందించిన శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా పూర్తి చేసినట్లు దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంబ అన్నారు.
విగ్రహాలకు బాలాలయంలో చర ప్రతిష్ట నిర్వహించామని, ఇకనుంచీ యథావిదిగా నిత్య ఆరాధన జరుగుతుందని చెప్పారు. ఏడాదిలోపు నీలాచలం కొండపై పై ఆలయాన్ని నిర్మించడానికి ప్రణాళికలు రూపొందుతున్నాయని, ఈ విగ్రహాలను కొత్త ఆలయంలో పునః ప్రతిష్ట చేస్తామని తెలిపారు.
నిత్య ఆరాధాన ఇక ప్రారంభం
నీలాచలం ఆలయం కోసం టిటిడి రూపొందించిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలకు బాలాలయంలో, చర ప్రతిష్ట పూర్తయ్యిందని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు చెప్పారు. పూర్వం నీలాచలం అలయంలో జరిగినట్లే, ఈ విగ్రహాలకు ఇకనుంచీ ఎప్పటిలాగే నిత్యారాధన జరుగుతుందని ఆయన తెలిపారు. శాస్త్రప్రకారం ఏడాది వరకూ బాలాలయంలో విగ్రహాలను ఉంచి, నిత్యారాధన జరపవచ్చని, ఆ లోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయవలసి ఉందని ఆయన చెప్పారు.