నెల్లూరు నగర పరిధిలో అక్రమ లేఅవుట్లు ఎలా మంజూరు చేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దశయ్యను ప్రశ్నించారు. దీనివల్ల కార్పొరేషన్ కు ఎంతో నష్టం జరుగుతుందని, ఎందుకిలా చేస్తున్నారని అడిగారు. అపార్ట్మెంట్ నిర్మాణాల్లో కూడా ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటువంటిదేమీ లేదని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దశయ్య చెప్పగా, నాతో వస్తారా? నేను చూపిస్తానని ఎంపీ ఆదాల చెప్పడంతో, దశయ్య మౌనం దాల్చారు. దీంతో రెండు రోజుల్లో వీటిపై తనకు నివేదిక ఇవ్వాలని అడిగారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కార్పొరేటర్లు నగర మున్సిపల్ కమిషనర్ హరితతో కలసి నెల్లూరు ఎంపీ ఆదాల నెల్లూరు కౌన్సిల్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎంపీ ఆదాల మాట్లాడుతూ మాంసం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణను కోరారు. అంతకు ముందు కార్పొరేటర్లు సీసీ రోడ్లు, డ్రైన్లు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను విన్నవించగా, రెండు వారాల్లోగా వాటిని పరిష్కరించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.
ఎంపీ సూచనల మేరకు కార్పొరేషన్ కమిషనర్ హరిత మాట్లాడుతూ వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లతో పాటు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, నరసింహారావు, ఏసు నాయుడు తదితరులు పాల్గొన్నారు.