ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్ గత నెలలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ’ఇగురం‘ కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని ఈ రోజు సీఎం కేసీఆర్ అభినందించారు.
మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసిన గంగాడి సుధీర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఇగురం రచయితవు కదా… చాలా బాగా రాస్తున్నావ్, కీప్ రైటింగ్ అని గుర్తుపట్టి అభినందించారు.
సీఎం కేసీఆర్ తనని గుర్తుపట్టడం, ఇగురం పుస్తకం గురించి విన్నాను, చదివాను అని స్వయంగా ఆయనే తనతో ప్రస్థావించడంతో తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. తన తొలి పుస్తకం ఇగురం సీఎం కేసీఆర్ వరకూ చేరడం, ఆయన దాన్ని చదవడం అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అని, గొప్ప అనుభూతి కలిగించిందన్నారు.
ఈ సందర్బంగా సీఎం ని తను కలువడానికి కారణమైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కి ధన్యవాదాలు తెలిపారు. మానేరు గడ్డపై పుట్టడం, హైదరాబాద్ విభిన్న సంస్కృతి, తెలంగాణకున్న ఘనమైన సారస్వత వారసత్వం, సాహితీ సుక్షేత్రమే తన రచనలకు ఆలంబన అని మంచి సాహిత్యాన్ని ఆదరిస్తున్న పాఠకులకు, పాలకులకు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసారు ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డి.