మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో ప్రతి రోజు ఏదో ఒక చోట భారీ వృక్షాలు నరికి వేస్తున్నారు. పెద్ద పెద్ద వృక్షాలు నరికి నేలమట్టం చేస్తున్నా ఫారెస్టు అధికారులు కానీ, మునిసిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నాలా చట్టం ప్రకారం అనుమతులు లేకుండా చెట్లను నరకడం చట్ట విరుద్ధం అయినప్పటికీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. చెట్లను విచక్షణారహితంగా నరకడం వలన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాలుష్యం పెరిగిపోతున్నది. సంబంధిత అధికారులు తనిఖీల విషయంలో జాప్యం వల్లనే ఇలా జరుగుతున్నదనేది బహిరంగ రహస్యం.
చెట్లు నరికిన వారికి భారీగా అపరాధ రుసుము విధించినట్లు అయితే చెట్లు నరకడానికి వెనకాడతారని కాలనీ వాసులు అభిప్రాయపడుతున్నారు. అపరాధ రుసుము విధించక పోవటం వల్లనే తేలికగా తీసుకుని ప్రతిరోజు కాప్రా ఏరియాలో ఏదో ఒక చోట చెట్లను నరకడం కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో ఉండి కూడా లేనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సద్వినియోగం పరుస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై ఉన్నాతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుకుంటున్నారు.