దివ్యాంగులకు మరింత చేయూతను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ ను రూ. 3016 ల నుండి రూ. 4016 లకు పెంచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు అదనంగా పెన్షన్ పెంపుదల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మంత్రి పెన్షన్ పెంపు ప్రొసీడింగ్స్ అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవీయ కోణంలో ఆలోచించి, దివ్యాంగుల పెన్షన్ వారి ఖర్చులకు సరిపడా ఉండాలని పెంచినట్లు తెలిపారు. 4016 పెన్షన్ తో ఖమ్మం నియోజకవర్గంలో 5522 మంది దివ్యాంగులకు ప్రతి నెల 2 కోట్ల 18 లక్షల రూపాయలు అందించి, సామాజిక భద్రత కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కొత్త రాష్ట్రమైన సంక్షేమం కొరకు ఏ రాష్ట్రం లో పెట్టనంత ఖర్చు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. క్రొత్త రాష్ట్రమైన అన్ని వర్గాలను కలుపుకొని జనరంజక పాలన అందిస్తున్నట్లు మంత్రి అన్నారు.
దంపతులతో పెన్షన్ పొందుతున్నవారు మరణిస్తే, ఆటోమేటిక్ గా వారి జీవిత భాగస్వామికి పెన్షన్ వస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మానవీయకోణంతో సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని, ఎవరు అడగకపోయినప్పటికీ దివ్యాంగుల పెన్షన్ వేయి రూపాయలు పెంచారని, దేశంలోని మరే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పెన్షన్, సంక్షేమ పథకాలు అమలు లేవని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో ఒక లక్షా 91 వేల 691 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు క్రింద ప్రతి నెల 44 కోట్ల 48 లక్షల నిధులు అందిస్తున్నామని అన్నారు. వీరిలో 28 వేల 966 మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతున్నారని, వారికి ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి జూలై మాసం నుంచి 4016 రూపాయల పెన్షన్ అందిస్తుందని అన్నారు. దివ్యాంగుల పెన్షన్ క్రింద ప్రతి నెల రూ. 11 కోట్ల 51 లక్షలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో ప్రతినెల సదరం క్యాంపులు నిర్వహిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆసరా పెన్షన్ అందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.