ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని, వారికి మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. కళాశాల కొరకు కేటాయించిన పాత కలెక్టరేట్, రహదారులు మరియు భవనాల శాఖ కార్యాలయం, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ, జిల్లా పౌర సరఫరాల శాఖ, ఇవిఎం గోడౌన్లలో వైద్య కళాశాల విభాగాల ఏర్పాటుకు చేస్తున్న మార్పులను కలెక్టర్ పరిశీలించారు. పనులు సమాంతరంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం వైద్య కళాశాలకు ఎన్ఎంసి నుండి క్లియరెన్స్ వస్తుందని ఆయన తెలిపారు. 500 పడకలతో వైద్యసేవలకు సంబంధించిన అన్ని మౌళిక సదుపాయాలు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నట్లు, భవనాలను కళాశాల ఏర్పాటుకు అనుగుణంగా సవరణలు జరుగుతున్నట్లు ఆయన అన్నారు. త్వరితగతిన పనుల పూర్తికి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవలపై కలెక్టర్ వైద్యాధికారులతో పమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా విభాగాలలో నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా తమ పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. విభాగాల వారిగా సాధించిన ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ చేయాలని తెలిపారు. కంటి విభాగంలో గత మాసంలో 80 మేజర్ శస్త్ర చికిత్సలు చేశారని, నెలకు కనీసం 300 శస్త్ర చికిత్సలు చేయాలని అన్నారు.
కంటి వెలుగు కార్యక్రమంలో రెఫర్ చేసిన కాటరాక్ట్ చికిత్సలు షెడ్యుల్ చేసుకొని వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. జనరల్ వైద్య విభాగంలో 42 మేజర్ శస్త్ర చికిత్సలు చేశారని, వచ్చే మాసంలో 200 శస్త్ర చికిత్సలు చేయాలని ఆయన తెలిపారు. ఆర్థో విభాగంలో 43 మేజర్ శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందని ప్రయివేటు ఆసుపత్రుల్లో రెట్టింపు శాతం సర్జరీలు అవుతున్నాయని, ఎక్విప్మెంట్, వైద్యులు ఉన్నప్పటికి లక్ష్యాలను చేరుకోలేకపోవడం సరికాదన్నారు. ఏప్రిల్ మాసంలో నిర్దేశించిన లక్షాలను మించి మెరుగుపర్చుకోవాలన్నారు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి, డాక్టర్లు, వసతులు కల్పించినట్లు, అందుకనుగుణంగా సేవలు కూడా ఉండాలని ఆయన అన్నారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ రాధికా గుప్త, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వర్ రావు, ఫ్రొఫెసర్లు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి డా.బి. మాలతి, ఆర్ఎంఓ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఉమామహేశ్వరరావు, అర్భన్ తహశీల్దారు శైలజ, హెచ్ఓడీలు, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.