రామ్ గోపాల్ వర్మతో రాజకీయ సినిమాలు తీయించి రాజకీయ లబ్ది పొందడం అలవాటుగా మారిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాచిక ఈ సారి పారేలా కనిపించడం లేదు. జగన్ రాజకీయ జీవితంపై రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాకు ఇప్పుడు కష్టాలు ఎదురయ్యాయి. రామ్ గోపాల్ వర్మ అప్ కమింగ్ మూవీ వ్యూహంకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో, సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది.? భారీ కట్స్ పడనున్నాయా? అనే చర్చ మొదలయింది.
ఈ సినిమాను తాను వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నిజజీవితాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన జీవితంలోని కీలకమైన ఘట్టాలను తెరకెక్కిస్తున్నానని ఇప్పటికే వందలమార్లు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. దీన్ని రెండు పార్టులుగా రూపొందిస్తున్నామని చెప్పారు కూడా. ఈ బయోపిక్లో మొదటి పార్ట్ వ్యూహం, రెండో పార్ట్ శపథం. ఇప్పటికే వ్యూహం టీజర్, ట్రయిలర్ కూడా రిలీజ్ అయ్యాయి. త్వరలోనే విడుదలకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.
సినిమాని వీక్షించిన తర్వాత వర్మ వ్యూహం మొత్తం వ్యక్తిగత వ్యవహారాలు, ఇతరుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించిందని తెలుస్తోంది. ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్తోపాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాత్రలను వక్రీకరిస్తూ పలు సీన్లు తెరకెక్కించారని టీజర్, ట్రయిలర్లోనే అర్ధం అవుతోంది. ఇవే ఇప్పుడు వర్మ వ్యూహానికి నెగిటివ్గా మారుతున్నాయనే చర్చ మొదలయింది. ఈ దృశ్యాలను వీక్షించిన తర్వాతే సర్టిఫికెట్ జారీ చేయలేమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం.
అయితే, సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్పై వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిప్పులు చెరుగుతున్నారట.. దీనిపై రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నా కూడా కొన్ని సీన్లకి కత్తెర తప్పదని ఫిల్మ్ నగర్ టాక్. వైసీపీ మెప్పు కోసం వర్మ శృతిమించి చేసిన సీన్లకు కట్ చెబుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వర్మ వ్యూహం సెన్సార్ కత్తెరకి బలి అవుతుందా? లేదా? అనేది త్వరలోనే తేలనుంది.