సమీప భవిష్యత్తులో భారత్- అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయి? అనే అంశం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య కుదిరిన స్నేహం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు మార్గాలను సుగమం చేశాయి. రక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, అంతరిక్షం, డిజిటల్ వంటి కీలక రంగాలలో ఇరుదేశాల భాగస్వామ్యం మంచి ఫలితాలు ఇచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ప్రపంచ భద్రత, సుస్థిరత, ఆర్థిక వికాసం వంటి అతి ముఖ్యమైన అంశాల విషయంలో భారత్ – అమెరికాల మధ్య మైత్రీబంధం ఎంతగానో బలపడింది.
ఒప్పందాల అంగీకారంపై భారత్కు ట్రంప్ ప్రశంసలు
డోనాల్డ్ ట్రంప్ భారత్ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అందిస్తున్నసహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా కొలిక్కిరాని కీలక ఒప్పందాలపై అంగీకారం కుదిరినట్లు ప్రశంసించారు. యూఎస్ లో 40 లక్షల భారతీయులు అమెరికా సౌభాగ్యం కోసం కృషి చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్నిపోషిస్తోందని విమర్శిస్తూ భారత్ కు అండగా ఉండగలని అమెరికా బేషరతుగా మద్దతు ప్రకటించింది.
బైడెన్ రాకతో అమెరికా భారత్ పట్ల వైఖరి ఏంటో?
భారత్ సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ దేశాల అక్రమ చొరబాట్లను వ్యతిరేకించిన అమెరికా అవసరమైతే ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించవగలదని ప్రకటించింది. కానీ భారత్, అమెరికా ప్రమేయాన్నిసున్నితంగా తిరస్కరించడం గమనార్హం.
అయితే జో బైడెన్ చైనా, పాకిస్థాన్ దేశాలతో ఉన్నవ్యాపార వాణిజ్య పరస్పర అవసరాల దృష్ట్యా మెతక వైఖరి ప్రదర్శిస్తే భారత్
ఎలా స్పందిస్తుందో వేచిచూడాలని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ఆర్సీ, సీఏఏ, 370లపై వామపక్షాల వ్యతిరేకత
ఇక ఎన్ ఆర్ సి, సీ ఏ ఏ, ఆర్టికల్ 370 అంశాలపై డెమోక్రా ట్లలోని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జో బైడెన్ వర్గంలో కీలకనేత కమలా హ్యారీస్ కూడా ఈ విషయంలో భారత్ విధానాలతో విభేదించారు. అయితే బైడెన్ మధ్యేవాదని భారత్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. భారత్ అంతర్గత వ్యవహారాలలో ఎన్నడూ తలదూర్చని ట్రంప్ కు డెమోక్రాట్లకు మధ్య చాలా విషయాలలో తేడా ఉంది. ఈ నేపథ్యంలో భారత్- అమెరికా మధ్య మూడు ముఖ్యమైన అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నట్లు విశ్లేషణలు తెరపైకి వచ్చాయి.
వాణిజ్య సంబంధాలపై ఇప్పటికీ కొనసాగుతున్నప్రతిష్టంభన
ఉగ్రవాదం- పాకిస్థాన్ ప్రమేయం, చైనాతో వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష, ప్రపంచ దేశాలతో ఆర్ధిక సంబంధాలు
వంటి కీలక అంశాలు ఇరుదేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయగలవు. అత్యంతవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నచైనాను నిలువరించడానికి భారత్ సహకారం అవసరాన్నిఅమెరికా గుర్తించింది. చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్ ఉన్నభారత్ లో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు అమెరికా ప్రయత్నించింది. అయితే భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి అంగీకారం కుదరలేదు. ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
వీసాలను బైడెన్ పెంచుతారా?
గతంలో 8 ఏళ్ళు అమెరికా ఉపాధ్యక్షుడుగా ఉన్నజో బైడెన్ భారత్, అమెరికాల మధ్య 500 బిలియన్ డాలర్లకు వాణిజ్యం పెరగాలని సూచించారు. హెచ్ 1బీ వీసా, ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠినంగా వ్యవహరించిన ట్రంప్ వైఖరిని ఖండించిన జో బైడెన్ హెచ్1 వీసాల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భారత్ తో సహా అనేక దేశాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. దశాబ్దాలుగా భారత్, అమెరికాల మధ్య ప్రస్తుతం ఉన్నసంబంధాలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని పరిశీలకుల అంచనా.
భద్రతా మండలిలో శాశ్వత స్థానంపై అమెరికా వైఖరి?
ఇక భద్రతా మండలిలో శాశ్వత స్థానం ఆశిస్తున్నభారత్ కు అమెరికా మద్దతు తెలిపే అవకాశం ఉంది. మొత్తంమీద భారత్ పట్ల అమెరికా వైఖరిలో చెప్పుకోదగిన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు లేవని, ఇప్పటివరకూ ఇరుదేశాల మధ్యఉన్న స్నేహాధర్మమే భవిష్యత్తులో కూడా ప్రకటితం కాగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
పొలమరశెట్టి కృష్ణారావు