దేశంలో పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒమిక్రాన్ వైరస్ వల్ల గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలను వాయిదా వేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ భారత ఎన్నికల సంఘానికి మెమోరాండం పంపింది. వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థించారు.
ఎఐబిఎ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాది డాక్టర్ ఆదిష్ సి అగర్వాల్ కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నికల ర్యాలీలకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని అన్నారు. ఒమిక్రాన్, కరోనా ముగిసే వరకు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేయకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల సమయంలో భారతదేశ ప్రజల నిర్లక్ష్యం కారణంగా కోవిడ్ -19 సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందిందని గుర్తు చేశారు.
దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక ఎన్నికల సంఘం దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత గురించి పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిందన్నారు. అదే సమయంలో, కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్ దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులు ఉన్నాయని పరిగణనలోకి తీసుకోకుండా, మరో 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన తర్వాత ఎన్నికల విషయంలో ఎలాంటి జాప్యం జరగదని చెప్పడం ఆశ్చర్యమేసిందని అన్నారు. దీనివల్ల థర్డ్ వేవ్ తప్పదని, పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని అన్నారు.