పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తూ పంజాబ్ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కాబోయే సీఎంను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వరుడు లేకుండా ఎలాంటి ఊరేగింపు ఉంటుందంటూ పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రకటించాలని సిద్ధూ డిమాండ్ చేశారు. ఎవరు నాయకత్వం వహిస్తారో పంజాబ్ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని, పంజాబ్లో ఎవరి రోడ్మ్యాప్ పని చేస్తుందో ఆ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. లేకుంటే ఈసారి మన పరిస్థితి తారుమారవుతుందని అన్నారు.
ఈ నేఫథ్యంలోనే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ స్పందించారు. కాంగ్రెస్ పంజాబ్ యూనిట్ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి పని చేసేందుకు, పార్టీ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. తనకు, సిద్ధూకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చన్నీ ఈ ప్రకటన చేశారు.
సిద్ధూ తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిద్ధూ చేసిన ప్రతికూల వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు, చన్నీ పార్టీకి నమ్మకమైన సైనికుడని, చాలా చిత్తశుద్ధితో తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. సిద్ధూ సాహబ్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇప్పటికే చేస్తున్నాను.
పార్టీ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే. పార్టీ ఏది చెబితే అది పాటిస్తానని చన్నీ అన్నారు. విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తాను. ఇది ఎక్కడి నుండైనా రావచ్చు. సిద్ధూ విమర్శించే ప్రయత్నం చేసినా, అతని మాట విని సరిదిద్దుకుంటాను.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.