పాకిస్తాన్ తో యుద్ధం వస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లో గెలవలేదు….. పాకిస్తాన్ పత్రికల్లో దీనికి సంబంధించిన వార్త ప్రముఖంగా ప్రచురితం అయింది.
భారత్ కు చెందిన ఎన్ సి ఆస్తానా అనే రిటైర్డ్ ఐపిఎస్ అధికారి రాసిన ‘‘నేషనల్ సెక్యూరిటీ అండ్ కన్వెన్షనల్ ఆమ్స్ రేస్’’ అనే పుస్తకంలో ఈ విషయం ఉన్నదని పాకిస్తాన్ పత్రికలు చెబుతున్నాయి. చైనా, పాకిస్తాన్ లతో అనుసరించాల్సిన యుద్ధ వ్యూహాలపై భారత్ తీవ్ర తికమకలో ఉందని ఆ పుస్తకంలో ఆస్తానా పేర్కొన్నారని పాకిస్తాన్ పత్రికలు ఘోషిస్తున్నాయి.
మిలిటరీ అధికారుల వ్యూహాలు చూస్తుంటే చైనా లేదా పాకిస్తాన్ ను ఓడించేలా కనిపించడం లేదని ఆ పుస్తకంలో వ్యాఖ్యానించారట. ఈ పుస్తకంపై సమీక్ష చేసిన సిద్దార్ధ్ వరదరాజన్ అభిప్రాయాలను కూడా పాకిస్తాన్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారత్ అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటున్నదని ఆస్తానా తన పుస్తకంలో వెల్లడించారు. ఇలా ఇంత ఖర్చు చేసి ఆయుధాలు సమకూర్చుకోవడం కన్నా చైనా పాకిస్తాన్ లతో సహృద్భావంతో మెలగి సమస్యలు పరిష్కరించుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆస్తానా మొత్తం 48 పుస్తకాలు రాశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన పలు వ్యాసాలు కూడా రాశారు. గత ఆరు సంవత్సరాల నుంచి భారత్ యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నదని ఆయన తరచూ విమర్శిస్తుంటారు.
గత ఐదు సంవత్సరాలలో భారత్ ఆయుధాల కొనుగోలు కోసం దాదాపుగా వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని ఆస్తానా చెబుతుంటారు. ఈ వంద కోట్ల రూపాయలలో 36 రాఫాలే జెట్ ల ఖరీదు కలపలేదని కూడా ఆయన తెలిపారు.