విశాఖలో దారుణం జరిగింది. శిశువు బతికి ఉండగానే కొందరు వ్యక్తులు ఖననం చేయడానికి యత్నించి దొరికి పోయారు.
విశాఖ కాన్వెంట్ శ్మశాన వాటిక లో ఈ ఘటన జరిగింది. ముక్కుపచ్చలారని శిశువును బతికి ఉండగానే పూడ్చేయాలని కోరుతూ విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశాన వాటికకు నలుగురు వ్యక్తులు వచ్చిన ఘటన కలకలం రేపింది.
విశాఖ కాన్వెంట్ జంక్షన్లోని హిందూ శ్మశాన వాటికకు కారులో నలుగురు వ్యక్తులు వచ్చారని.. కవర్లో ఉంచిన శిశువును పాతిపెట్టాలని కోరారని శ్మశాన వాటిక సిబ్బంది తెలిపారు.
పాతిపెట్టేందుకు కవర్ తెరవగా శిశువు ఏడవటం ప్రారంభించిందన్నారు. బతికి ఉండగానే ఎందుకు ఖననం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారని సిబ్బంది తెలిపారు.
ప్రస్తుతం శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై కంచరపాలెం పోలీసులకు శ్మశాన వాటిక సిబ్బంది ఫిర్యాదు చేశారు.