రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను దారుణంగా అవమానిస్తున్నది. అందులో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు అయిన గవర్నర్ తమిళసై నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఆ పర్యటనలో పాల్గొని జయప్రదం చేయడం ఆనవాయితీ కాగా దాన్ని ఎమ్మెల్యేలు ఉల్లంఘించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గవర్నర్ పర్యటనకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ పర్యటనకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనకూడదని అధిష్టానం ఆదేశించడం వల్లే గవర్నర్ పర్యటనకు నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.