8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగోత్సవ్- 75 రోజుల కౌంట్డౌన్ లో భాగంగా మంత్రిత్వ శాఖకు కేటాయించిన 39 వ రోజు సందర్భంగా రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, పత్రికా సమాచార కార్యాలయం, తెలంగాణ రీజియన్ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
అందులో భాగంగా 3 రోజుల పాటు, మే 13-15 వ తేదీ వరకు యోగా ప్రాధాన్యతను తెలియజేసేలా రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో కోఠిలోని కేంద్రీయసదన్ లో యోగా ప్రాముఖ్యతపై చాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ‘యోగా విశిష్టత, ఆయుష్ ప్రాముఖ్యత, నిత్యజీవితంలో యోగా అవసరం’ పై పత్రికా సమాచార కార్యాలయం వెబినార్ ను నిర్వహించింది.
మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన భావితరాలకు యోగా ప్రాధాన్యతను తెలియజేసేలా రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శన ఉందని ఎన్.ఎన్.ఎస్.ఎస్.రావు , చీఫ్ ఇంజనీర్ అన్నారు. కోఠిలోని స్థానిక కేంద్రీయ సదన్ లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శనను రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
శృతి పాటిల్, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022, 75 రోజుల కౌంట్డౌన్ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగోత్సవ్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యోగాను మన దైనందిన జీవితం లో భాగంగా చేసుకోవాలని, తద్వారా మన ఆరోగ్యమే కాకుండా మన రాబోవు తరాలకు కూడా యోగా ప్రాధాన్యతను తెలియజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 75 రోజుల కౌంట్డౌన్ సందర్భంగా ‘యోగోత్సవ్’-‘యోగా విశిష్టత, ఆయుష్ ప్రాముఖ్యత, నిత్యజీవితంలో యోగా అవసరం’ పై పత్రికా సమాచార కార్యాలయం నేడు నిర్వహించిన వెబినార్ లో డా. శ్రీకృష్ణ చందక, డైరెక్టర్, యోగా హెల్త్ క్లినిక్ కీలకోపన్యాసం చేశారు.యోగా విశిష్టత, ఆయుష్ ప్రాముఖ్యత, నిత్యజీవితంలో యోగా అవసరాన్ని ప్రజలకు తెలియజేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషిని డా. శ్రీకృష్ణ చందక కొనియాడారు.
“కోవిడ్ మహమ్మరి నుంచి రక్షణ పొందేందుకు, కోవిడ్ రోగులు తిరిగి కోలుకునేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రస్తుత కాలంలో ప్రజలందరిలో దీనిపై అవగాహన పెరిగింది.” యోగా, జాతిమొత్తాన్ని, భాషతో సంబంధం లేకుండా, భారతీయ సంస్కృతిలో భాగమై, వసుదైక కుటుంబం అనే భావనను పెంపొందిస్తుందని ఆయన అన్నారు. యోగోత్సవ్ లో భాగంగా రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, పత్రికా సమాచార కార్యాలయం అధికారులు, సిబ్బంది యోగాసనాలు , సూర్య నమస్కారాలు చేయడం జరిగింది.