పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులకు డీఆర్వో గణపతిరావు ఆదేశాలు
వివిధ శాఖల పరిధిలోని ఇంజనీరింగ్ విభాగాల్లో పని చేసే అసిస్టెంట్ ఇంజినీర్లకు ఈ నెల 14, 15వ తేదీల్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్ష జరుగుతుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీలో ని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు వెల్లడించారు.
పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్ష సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
రెండు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం పరీక్ష జరగనున్న నేపథ్యంలో లైజన్ అధికారుల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని, పోలీసు అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాలో ఆరు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 2,285 మంది హాజరవుతున్నారని, సంబంధిత ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ ప్రతినిధులు వెంకటరావు, కె. శ్రీనివాసరావు, జి. సాగర్, వివిధ ఇనిస్టిట్యూట్ల ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.