చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీఎన్ఏ ఒక్కటే అంటూ వ్యాఖ్యానించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన డిఎన్ఏ ఎవరిదో చెప్పాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి నిలదీశారు. ఆయన మాటల తీరుచూస్తే ఆయనది వైఎస్ రాజారెడ్డిది ఒకటే డిఎన్ఏ అనిపిస్తోందని చెప్పారు.
అధికారులు, ప్రతిపక్షనేతలకు కులాలు, డిఎన్ఏలు అంటగట్టే నీచ సంప్రదాయం వైకాపా నేతలకు మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహిస్తున్న ఎస్ఈసీ ప్రభుత్వం నిర్ణయాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సజ్జల చెప్పడాన్ని తప్పు పట్టారు.
చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామని, ఎన్నికల విధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించడం ఆయన కుటిలత్వానికి తార్కాణమన్నారు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండటం రాష్ట్ర కర్మ అంటున్న సజ్జలలాంటి బుద్ధి హీనులు ప్రభుత్వ సలహాదారుగా వుండటం రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నారు.
ఇలాంటి పనికి మాలిన సలహాదారులు ఉండటం వల్లే ప్రభుత్వం సకాలంలో కొత్త ఓటర్ల జాబితా రూపొందిచ లేకపోయిందని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన మూడు లక్షల అరవై వేల మంది ఓటు హక్కు కోల్పోయారని తెలిపారు.
తెలివితక్కువ దద్దమ్మలు, మొండితనం మూర్తీభవించిన వారు సలహా దారులుగా ఉండటం వల్లే సిఎం జగన్ పిచ్చి తుగ్లగ్ లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రతి నిర్ణయానికి కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకోవలసి వస్తున్నదని విమర్శించారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం వల్లే మంత్రులు, సలహాదారులు అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైకాపా నేతలు గ్రామాలలోకి వెళితే పంచలు ఊడదీసే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
రామతీర్థంలో విజయసాయి రెడ్డిపై ప్రజలు చెప్పులు వేసినా వైకాపా నేతలకు జ్జానోదయం కాకపోవడం దురదృష్టమని చెప్పారు. బలవంతపు ఏకగ్రీవాలకు తపిస్తే భంగపాటు తప్పదని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.