రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర అడుగులు వేస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తుది గడువు ముగుస్తున్నా రాజకీయ ప్రతిష్ఠంభన ఇంకా తొలగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికి 13 రోజులైంది. అధికారంలో వాటాల పంపంకంపై బీజేపీ, శివసేనల మధ్య చిక్కుముడి వీడడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్కు బిజెపి చాలా దూరంలో నిలిచింది. మిత్ర పక్షమైన శివసేన కలిసి రాకపోవడంతో ఏర్పడిన ప్రతిష్ఠంభనను వివరించేందుకు నేడు మహారాష్ట్ర గవర్నర్ను బీజేపీ ప్రతినిధి బృందం కలవనుంది. ఈ ప్రతినిధి బృందంలో ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లేరు. వారు గవర్నర్ కు ఏం చెబుతారో తెలియదు కానీ ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్నది. ఈనెల 9న నూతన ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్లైన్. డెడ్లైన్ ముగిసిన తర్వాత ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారా లేక రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా అనేది కూడా సంశయమే. ఇక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు పార్టీలు చొరవ చూపాలని అన్నారు. కాగా శివసేన మాత్రం తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమని విస్పష్టంగా పేర్కొంటోంది. తమ ఎంఎల్ఏలను బిజెపి కొనేందుకు ప్రయత్నిస్తున్నదని, ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శివసేన నేడు హెచ్చరించింది.
previous post