కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతుల విషయంలో ధరలు పెంచడమే ప్రభుత్వం పరమావధిగా మార్చుకుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. వసతి గదుల ధరలను రెట్టింపు కాదు మూడు రెట్లు పెంచడాన్ని బిజెపి తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
తిరుమల తిరుపతిలో ప్రస్తుతం ఉన్న వసతి సౌకర్యాలను మెరుగు పరిచామన్న సాకుతో ధరలు పెంచడం ఎంత వరకు న్యాయమో భక్తులకు తిరుమలతిరుపతి పాలకమండలి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో గదుల ధరల పెంపు ఆకాశాన్ని అంటే రీతిలో పెంచేశారు. రూ.150 ధరలు వున్న ఒక్కో గదిని రూ.1700 పెంచారని ఇది మద్యతరగతి,సామాన్య భక్తులకు ఇబ్బందికరమేనని సోమువీర్రాజు అన్నారు.
హిందూ దేవాలయాల్లో మాత్రమే ధరలు పెంచడానికి ఉన్న ప్రభుత్వంగా వైసీపి కనపడుతోంది. తిరుమల విషయంలో పాలకమండలి ధర్మంగా వ్యవహరించకుండా దర్శనానికి వచ్చే భక్తులను ముక్కుపిండి వసూలు చేసే విధంగా ధరలను ఆమాంతం పెంచేశారు .
నారాయణగిరి రెస్ట్ హౌస్ 4 లో ఒక్కో గది రూ. 750 నుండి రూ.1700 పెంచారంటే పాలక మండలి కాఠిన్యం హిందువులకు అర్ధం అవుతోందని సోమువీర్రాజు ఆరోపించారు.స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 వున్న గదిని రూ. 2200 పెంచారంటే మూడురెట్లు అధికంగా పెంచారు హిందూ ధార్మిక సంఘాలను కూడా సంప్రదించకుండా భక్తులు వసతి సౌకర్యం ధరలు పెంచారంటే భవిష్యత్ లో భక్తులకు వసతి సౌకర్యం కలిగించరేమోనన్న అనుమానాలు వైసీపి ప్రభుత్వం, పాలకమండలి పై కలుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.