నియంత్రిత పంటల విధానంపై నల్గొండ కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమం రసాభాస అయింది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ, టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వేదికపైనే వాగ్వాదం చోటు చేసుకుంది. రైతు రుణమాఫీ అంశంపై మంత్రి జగదీశ్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ విభేదించారు. ఎంపీకి, మంత్రికి మధ్య జరిగిన వాగ్వాదంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
కార్యక్రమంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని విధంగా తెరాస ప్రభుత్వం రైతులకు సుమారు రూ.17వేల కోట్ల రుణమాఫీ చేసిందని పేర్కొనగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. మంత్రి అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపించారు.
దీనికి సమాధానంగా మంత్రి మాట్లాడుతూ రుణమాఫీ వివరాలకు సంబంధించి లెక్కలన్నీ అసెంబ్లీలో ప్రస్తావించామని, కానీ, ప్రతిపక్షపార్టీ నాయకులు వినకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. చివరగా తాను మంత్రినని ఇక్కడ నేను చెప్పింది వినాలని పేర్కొన్నారు.