రాజధాని అమరావతిపై సీఎం జగన్, మంత్రుల వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని అమరావతి రైతులు అన్నారు. కోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించినా.. మళ్లీ పాలనా వికేంద్రీకరణ అంటూ మెుండిగా వ్యవహరించమేంటని ముఖ్యమంత్రి జగన్పై రైతులు మండిపడ్డారు. చట్టసభలు, కోర్టులంటే సీఎం జగన్కు లెక్కలేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా.. ప్రభుత్వం మారటం లేదన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తే అన్ని జిల్లాలకు ప్రతిఫలాలు అందుతాయని, తమ పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే కోర్టులో న్యాయం దక్కిందని వారన్నారు. కోర్టు తీర్పులను కూడా లెక్క చేయని నేతలకు మరి ఎలా చెప్పాలి? అంటూ వారు ప్రశ్నించారు.
చట్టసభల్లో అందరి గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పాలి. సీఎం జగన్ ఈసారి మూడు రాజధానుల అంశంపై ఎన్నికలకు వెళ్లాలి అని అమరావతి రైతులు అన్నారు. పాలనా వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని, రాజధానిపై నిర్ణయం తమ హక్కని ముఖ్యమంత్రి జగన్ నిన్న అసెంబ్లీలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
రాజధాని విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు రాజ్యాంగంతోపాటు శాసనసభకు ఉన్న అధికారాలనూ ప్రశ్నించేలా ఉందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. చట్టసభకు చట్టాలు చేసే అధికారం లేదంటే న్యాయవ్యవస్థ చట్టాలు చేస్తుందా ? అని కూడా జగన్ ప్రశ్నించారు.
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని కూడా ఆయన తేల్చి చెప్పారు. కేవలం అమరావతి నిర్మాణం ఒక్కటే ప్రభుత్వ ప్రాధాన్యం కాదని, రాష్ట్రంలో మిగతా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుందని విషయాన్ని మరువరాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.