గత మూడు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం దళితులకు ద్రోహం చేస్తుందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పేరు మీద ఉన్న దాదాపు 45 వేల 687 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకట స్వామి ఆరోపించారు. కర్నూలు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి 115వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఏ ఒక్క దళిత బిడ్డ కు ఈ మూడు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల పేరుతో ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న దళితుల భూమిని 5 వేల ఎకరాలు లాక్కొని, దళితుల కడుపులు కొట్టారని ఆయన అన్నారు. దళిత విద్యార్థినీవిద్యార్థులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కూడా రద్దు చేసి దళితులకు విద్యను దూరం చేశారని ఆయన అన్నారు.
అంబేద్కర్ విద్యోన్నతి పథకం ద్వారా విదేశీ విద్యనభ్యసించే దళిత విద్యార్థులకు 15 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే స్కీమును కూడా రద్దు చేసి దళితులకు జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు దళితవాడల్లో ఎలాంటి విద్యుత్ చార్జీలు చెల్లించనవసరం లేదని, చెప్పి ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఎప్పటి నుండో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసి దళితవాడలో అంధకారం లోకి చేస్తున్నారని ఇలాంటి జగన్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ ప్రభుత్వంలో దళితులపై దళిత మహిళలపై జరుగుతు దాడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న రాజు, గిడ్డయ్య, మొహిద్దిన్ సుల్తాన్, ప్రశాంత్ రెడ్డి, మల్లికార్జున, మధు తదితరులు పాల్గొన్నారు.