రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చేతకాని జగన్ రెడ్డి బాధిత కుటుంబాలకు న్యాయం కూడా చేయడం లేదని పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తుమ్మలపూడి గ్రామంలో వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులపై అల్లరి మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రవర్తించిన తీరు ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రౌడీ రాజ్యాంగం విచ్చలవిడిగా నడుస్తోందని మరొక్క సారి రుజువైందని ఆయన తెలిపారు.
నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. తుమ్మలపూడి గ్రామంలో హత్యాచారానికి గురైన ఒక బీసీ మహిళ తిరుపతమ్మ కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించడానికి వెళ్తే వైసీపీ గూండాలు దాడి చేశారని ఆయన అన్నారు. పది మంది మూకను నియంత్రించలేని స్థితిలో రాష్ట్ర పోలీసులు ఉన్నారని అరవింద్ బాబు అన్నారు. టీడీపీ శ్రేణుల పై రాళ్లు విసురుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.
నారా లోకేష్ పై వైకాపా రౌడీమూకలు చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నామని అరవింద్ బాబు తెలిపారు. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నాడు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలా వ్యవహరించి ఉంటే ఆనాడు పాదయాత్ర కాదు కదా? వైసీపీ శ్రేణులు రోడ్డు మీద కూడా తిరిగే వారు కాదు అని ఆయన అన్నారు.
బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే నోటీసులు పంపుతున్నారు.. నోటీసులు ఇచ్చి ఇలా ఎంతకాలం ప్రతిపక్ష నేతలను పోలీసు యంత్రాంగం నియంత్రించగలరు అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 800 మంది మహిళల పై అత్యాచారం జరిగిందని ఆయన తెలిపారు.
ఒక్క బాధిత కుటుంబానికి అయినా న్యాయం చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. దాడులు జరిగితే బుల్లెట్ కన్నా వేగంగా వస్తానన్న జగన్ ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు.