విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక డీపీఓ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పూర్తి కాకపోవడానికి గల కారణాలను దర్యాప్తు అధికారులను అడిగి తెలుసుకొని, వారికి పలు సూచనలు చేసి, దర్యాప్తు పూర్తి చేసేందుకు దిశా నిర్దేశం చేసారు. గతంలో సమీక్ష చేసిన కేసుల్లో 30శాతం గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ తెలిపారు.
“జగనన్నకు చెబుదాం” కు వచ్చే ఫిర్యాదుల్లో విచారణను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని, విచారణ అంశాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే సమస్య పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, ఫిర్యాదుదారులతో మాట్లాడి పోలీసుశాఖ చేపట్టిన చర్యలను వివరించి, ఫిర్యాదును ముగిస్తున్నట్లుగా ఫిర్యాదు దారులకు ముందుగా తెలియజేయాలన్నారు.
ప్రతీ రోజూ “జగనన్నకు చెబుదాం” పోర్టల్లో లాగిన్ అయి, పోర్టల్ కు వచ్చే ఫిర్యాదులను గమనించాలని, వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఫేటల్ రోడ్డు ఏక్సిడెంట్ కేసుల్లో ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు ఐరాడ్ యాప్లో నమోదు చేయడంతోపాటు, అధికారులు సూచించిన ఈ-మెయిల్కు 48గంటల్లోగా ఎఫ్.ఐ.ఆర్. మరియు ఇతర వివరాలను పంపాలన్నారు. దిశ యాప్ పట్ల ప్రజలకు, మహిళలు, విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
దిశ మొబైల్ వెహికల్స్ ను వారి స్టేషను పరిధిలో ఉన్న కళాశాలలు, పాఠశాలల వద్ద పెట్రోలింగు నిర్వహించి, ఈవ్ టీజింగు జరగకుండా చూడాలన్నారు. ఎన్.డి.పి.ఎస్. కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని, కోర్టులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గత మాసంలో నమోదై, దర్యాప్తు పెండింగులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించారు.
త్వరితగతిన కేసుల దర్యాప్తు పూర్తి చేసి, నిర్ధిష్ట రోజుల్లోగా సంబంధిత న్యాయ స్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక దిశా నిర్దేశం చేసారు.