దేశంలో కరోనా అదుపు చేయడంలో, రోగులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమయ్యారని విపక్షాలు ఆరోపిస్తుంటే బిజెపి నేతలు తప్పు సరిదిద్దు కూకుండా ఒంటికాలిపై లేచి ప్రతి విమర్శలు చేస్తున్నారు.
ఇప్పుడు సాక్ష్యాత్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, ప్రజలు కూడా కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించడం మానేశారని అందుకే ఈ విపత్తు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా తొలి దశ తర్వాత ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, ప్రజలు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రెండో దశ కరోనా ఇంత తీవ్రంగా ఉందని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, ప్రజలు అప్రమత్తం కావాలని, పాజిటీవ్ గా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా ఒకరినొకరు విమర్శించుకోవడం ఆపి క్రియాశీలంగా పని చేయాలని మోహన్ భగవత్ హితవు చెప్పారు. కరోనా తొలి దశ లో కేసులు తగ్గిపోగానే ఫిబ్రవరి నెలలో ప్రధాని నరేంద్ర మోడీ వల్లే ఇది సాధ్యం అయిందని బిజెపి తీర్మానం చేసి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు బిజెపిని రాబోయే రోజుల్లో ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.