శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ – ములుగు ఆధ్వర్యంలో జిల్లా కార్మిక శాఖ సమన్వయంతో బండారుపల్లి లోని ఇటుక బట్టీలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. మాధవి ఇటుక బట్టీలలో పనిచేస్తున్న వలస కూలీలతో మాట్లాడి, అక్కడ వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న వలస కార్మికుల పనివేళలు, జీతభత్యాలు, విద్యుత్ సౌకర్యం వారి ఆహారం & మంచినీటి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే వారికి కులీ డబ్బులు సమయానికి వస్తున్నాయా, అందరికీ బ్యాంక్ అక్కౌంట్స్ , ఆధార్ కార్డులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యం లో అసంఘటిత కార్మికులకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు అవగాహన కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.మాధవి మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం అనేది సామాన్యుడి చట్టబద్దమైన హక్కు అని, అవసరమైనప్పుడు నిరుపేదలు ఈ ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలని జడ్జి కార్మికులకు సూచించారు.
అనంతరం జిల్లా సహాయ కార్మిక అధికారిణి వినోదమాట్లాడుతూ అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి గారు మాట్లాడుతూ కార్మికులు తమ పిల్లలు చిన్న వారైతే స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రం లో చేర్పించాలని, పెద్ద పిల్లలని స్థానికంగా ఉన్న పాఠశాలలకి పంపాలని సూచించారు. పనికి మాత్రం పంపవద్దని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా బాలల సంరక్షణ అధికారి జె. ఓంకార్, , అవుట్ రీచ్ వర్కర్ భూక్య రాజు, కార్మిక శాఖ సిబ్బంది, ఇటుక బట్టీ యజమాని వెంగయ్య మరియు (70) మంది ఒడిషా వలస కార్మికులు తదితరులు పాల్గొన్నారు.