చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన ఏపీ ఎకనామిక్ బోర్డు మాజీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ అవినీతిపై సీఐడీ దర్యాప్తు లో ప్రగతి కనిపించింది. స్టేషనరీ కొనుగోళ్లలో కూడా కృష్ణకిషోర్ అవినీతికి పాల్పడినట్టు వెల్లడయింది. ప్రాథమిక విచారణలో కోటి రూపాయల మేర అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించింది. ప్రతి సారీ స్టేషనరీ కొనుగోలు టెండర్లలో వరుసగా మూడే కంపెనీలు పాల్గొన్నట్టు గుర్తించారు.
వరుసగా ఒకే కంపెనీకి టెండర్లు దక్కాయి. మిగిలిన రెండు కంపెనీలపై దర్యాప్తు అధికారులు ఆరాతీయగా తాము టెండర్లలో పాల్గొనలేదని, వినియోగించిన లెటర్ హెడ్ చాలా పాతదని దర్యాప్తు అధికారులకు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. మరో కంపెనీ అసలు తాము టెండర్లలోనే పాల్గొనలేదని స్పష్టంచేసింది. ఏపీ ఎకనామిక్ బోర్డులో అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేస్తున్నవిషయం తెలిసిందే. ఇప్పటికే జాస్తి కృష్ణకిషోర్ పై 188, 403, 409, 120(బి) సెక్షన్లపై కేసు నమోదు చేశారు.