విజయవాడ ధర్నా చౌక్ వద్ద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అమాన్ సంఘం ఆధ్వర్యంలో 48 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా అమాన్ సంఘం అధ్యక్షులు అహ్మద్ మాట్లాడుతూ తమ సంఘం తరుపున ప్రధాన కార్యదర్శి హాజీ ఫారుక్ షుబ్లి గత 36 గంటల నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నారని తెలిపారు.
ఈ దీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ తమ మద్దతును తెలిపారు. ఈ దీక్షలో జమాత్ అహలె హదీస్ అధ్యక్షులు ఫేజలుర్ రెహమాన్, జమాతే వులమా హింద్, పలు ముస్లిం సంఘాలు, సిక్కు సంఘం నాయకులు కుల మతాలకు అతీతంగా పలు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన యావత్ ముస్లిం ప్రజలు స్వయంగా వచ్చి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అహ్మద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జనాబ్ ఫతావుల్ల పాల్గొన్నారు.