ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి ప్రస్తుతం ఏపీ వాటర్ రీసోర్స్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బదిలీ అయ్యారు. అంతకుముందు పలు కీలక శాఖల్లోనూ ఆయన పని చేశారు. నవంబర్ 30న ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ పదవీ విరమణ చేయనున్నారు.
దాంతో నూతన సీఎస్ ఎంపిక అనివార్యం అయింది. చీఫ్ సెక్రటరీగా ముఖ్యమంత్రి జగన్ ఎవరిని ఎంపిక చేసుకుంటారనే విషయంలో కొద్ది కాలం సస్పెన్స్ కొనసాగింది. సస్పెన్స్ ను తొలగిస్తూ అందరూ ఊహించినట్లుగానే సీఎస్ గా జవహర్ రెడ్డిని నియమించారు. సమీర్ శర్మ పదవీ విరమణ చేయగానే జవహర్ రెడ్డి సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
సీఎస్ అశకాశం దక్కుతుందని భావించిన పూనం మాలకొండయ్యను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో స్పెషల్ గా సీఎస్ గా నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మధుసూదన రెడ్డి, ఆ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే నియమితులయ్యారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న బుడితి రాజశేఖర్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.