కరోనా విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ టియుడబ్ల్యుజే (ఐజేయు) ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్ నగర్ ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డికి వినతి పత్రం అందించారు.
జర్నలిస్టులందరికి ప్రమాద భీమా సౌకర్యం రూ.50 లక్షలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మండల,పట్టణ కేంద్రాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కార్మిక శాఖ నుండి ప్రతినెల రూ.5 వేలు వేతనం చెల్లించాలని కోరారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వామ్యులు అవుతూ..ప్రజలను చైతన్యం పరుస్తున్న జర్నలిస్టుల అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషిచేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
సమస్యలు విన్న ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి..జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం లాక్ డౌన్ సందర్భంగా జర్నలిస్టులకు చేయూతను అందించిన ఎమ్మెల్యేకు యూనియన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు, దయాకర్ రెడ్డి, టివియల్, ధేనుమకొండ శేషం రాజు, నక్కా నరేష్, రామ్మూర్తి, చిట్టిపోతుల రమేష్, దేవరం రామిరెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్, సోమగాని రాంప్రసాద్ తదితరులు ఉన్నారు.