పల్నాడులో చివరి ప్రాంతంలో కూడా ఫోన్ సిగ్నల్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు అధికారులకు సూచించారు. శనివారం గుంటూరులోని, చంద్రమౌళి నగర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నందు జరిగిన గుంటూరు జిల్లా టెలికాం అడ్వయిజరీ కమిటీ మీటింగ్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ. ఫోన్ సిగ్నల్స్,ను పెంచటానికి, ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు పెంచటానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండే అందే పథకాలు ప్రతీది ఫోన్తో ముడిపడి ఉందని అన్నారు. ముఖ్యంగా పీహెచ్సీ సెంటర్లలో, అంగన్వాడీలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామసచివాలయాలు దగ్గర బీఎస్ఎన్ఎల్ సర్వీసులను కల్పించి, సిగ్నల్ సామర్థ్యాలను పెంచాలని సూచించారు.
ఈ సందర్భంగా పల్నాడుకు చెందిన బీఎస్ఎన్ఎల్ టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యులు.. అలపర్తి భాస్కరరావు, కొండవీటి కోటేశ్వరరావు, యన్నం రవీంద్రరెడ్డి, పోలా సతీష్, ఉదయ్ భాస్కర్ లు ఈ సమావేశంలో పాల్గొని పల్నాడు ప్రాంతంలోని పలు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు టెలిఫోన్ సిగ్నల్స్ ఉండటం లేదని, కొన్ని చోట్ల బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సర్వీసులు అంతగా లేకపోవడం వల్ల ప్రజలు బీఎస్ఎన్ఎల్ సర్వీసులును వాడటం లేదని.. దీనిపై దృష్టి సారించి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ గుంటూరు జీఎం చప్పరపు శ్రీధర్, ప్రసన్న కుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.