రాష్ట్రంలో అర్హత కలిగివున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు అందించిన హెల్త్ కార్డులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆరోగ్య శ్రీ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ నెల 20 నుండి 25 వరకు ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్యెల్యేలకు జర్నలిస్టులు వినతిపత్రాలు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) సోమవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పిలుపు నిచ్చింది.
పైన పేర్కొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ గత సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తమ సంఘం మూడు దఫాలు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట ఉద్యమాన్ని నిర్వహించి తహశీల్దార్లు, ఆర్డీవోలు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించిందని టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం లేకపోవడంతో మలి విడత ఉద్యమంలో భాగంగా మంత్రులు, ఎమ్యెల్యేలకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టినట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టులు విజయవంతం చేయాలని వారు కోరారు.