జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంగళవారం ములుగులో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన తెలిపి జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పిట్టల మధుసూదన్ మాట్లాడుతూ సోమవారం కాకతీయ యూనివర్సిటీలో రాజ్ న్యూస్ కెమెరామెన్ బిక్షపతి పై టిఆర్ఎస్వి నాయకులు దాడి చేయడాన్ని, అదేవిధంగా భైంసా లో ముగ్గురు జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేసే జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నందు, మాట్ల సంపత్, సృజన్, చుంచు రమేష్, పాల్గొనగా ఎస్ఎఫ్ఐ నాయకులు కుమ్మరి సాగర్, డివైఎఫ్ఐ నాయకులు కలువల రవీందర్ మద్దతు పలికారు.