రైతులు కష్టపడి పండించుకున్న పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ల లోనే అమ్మాలని ఎవరు కూడా మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లోని చిన్నంబావి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రైతు ధాన్యం కోనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులను నేడు ఆయన కలిసి మాట్లాడారు.
నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ధాన్యం అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాకే ధాన్యం తీసుకుంటాని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి కొనుగోలు ప్రారంభించేలా చూస్తానని జూపల్లి అన్నారు.