సిమెంటు పరిశ్రమలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయమైన వేతనాలు ఇవ్వాలని,వారిని పర్మినెంట్ చేయాలని ఈ నెల 28,29 తేదీలలో జరిగే కార్మిక గర్జనను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కార్మికులను కోరారు.
కృష్ణ పట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శీతల రోషపతి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న కార్మికుల కనీస వేతనమనేది హక్కుని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కనీస వేతన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిమెంటు పరిశ్రమలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని, అఖిల భారత స్థాయిలో సిమెంటు పరిశ్రమల యాజమాన్యానికి,కార్మిక సంఘాలకు జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.పి ఎఫ్,ఈఎస్ ఐ ప్రతి కార్మికుడికి వర్తింప చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.రాంబాబు,ఎస్. రాధాకృష్ణ,నాయకులు టి.శ్రీను,లక్ష్మయ్య సైదయ్య,అలెగ్జాండర్,నాగేశ్వరరావు,ప్రకాష్, రాజేష్,శౌరి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్