ప్రస్తుతం నడుస్తున్న 108 వాహనాల కాంట్రాక్టును అర్ధంతరంగా రద్దు చేసి అరబిందో ఫార్మాకు చెందిన వారికి కట్టబెట్టడంపై భారీ అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
తన లేఖ కు, ఇందులో ప్రస్తావించిన అంశాలకు తక్షణమే సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీవీజీ అనే సంస్థతో 108 వాహనాల కాంట్రాక్టు ఉన్నది. ఈ కాంట్రాక్టును 2018లో ఐదు సంవత్సరాల కాలపరిమితికి చేసుకున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నాటి నుంచి 108 కాంట్రాక్టు సంస్థను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు తాజాగా కాంట్రాక్టు ఇచ్చారు. బీవీజీ సంస్థ నెలకు ఒక వాహనానికి ప్రభుత్వం 1.31 లక్షలు చెల్లిస్తుందని, తాజాగా అరబిందోకు నెలకు ఒక వాహనానికి 2.21 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇంత భారీ ఎత్తున రేటు పెంచి ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసి హడావుడిగా కొత్త ఒప్పందాన్ని చేసుకోవడానికి కారణం ఏమిటి అని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. ఈ కాంట్రాక్టులో ఎంపి విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో ఫార్మా చైర్మన్ రామ్ ప్రసాద్ రెడ్డి పాత్ర తేల్చాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.